Cricket: ధోనీ అంతలా బాధపడడాన్ని నేనెప్పుడూ చూడలేదు: సంజయ్ మంజ్రేకర్

  • ధోనీ ఎంతో నిరాశతో కనిపించాడు
  • అతడి మాటలు వింటే కుంగిపోయాడని అర్థమైంది
  • ధోనీ కోసం నా హృదయం తపించిపోతోంది

ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్లో ముంబయి ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం మాజీ క్రికెటర్, స్పోర్ట్స్ చానల్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీని చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పాడు.

ధోనీ అంతగా బాధపడడాన్ని ఎప్పుడూ చూడలేదని తెలిపాడు. ఒక్క పరుగుతో ఓడిపోవడం పట్ల తన హృదయం ధోనీ కోసం తపించిపోయిందని, మ్యాచ్ ఫలితం పట్ల ధోనీ కూడా తీవ్ర విచారంతో కనిపించాడని మంజ్రేకర్ పేర్కొన్నాడు. "ధోనీని అంత నిరాశామయంగా చూడడం ఇదే ప్రథమం. ధోనీ మాటలను బట్టి అతడెంత కుంగిపోయాడో అర్థమవుతోంది" అంటూ వ్యాఖ్యానించాడు.

కాగా, మంజ్రేకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఫైనల్ మ్యాచ్ లో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయని, తమకంటే ముంబయి ఇండియన్స్ జట్టు ఒక తప్పిదం తక్కువ చేసింది కాబట్టే గెలిచిందని అభిప్రాయపడ్డాడు.

More Telugu News