KCR: నేడు మళ్లీ తమిళనాడు వెళ్లనున్న కేసీఆర్.. రేపు స్టాలిన్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చ

  • ఇటీవలే కేరళ, తమిళనాడులో పర్యటించిన కేసీఆర్
  • కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం ప్రత్యేక విమానంలో తమిళనాడుకు
  • శ్రీరంగం,తిరుచ్చి ఆలయాల సందర్శన

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు మరోమారు తమిళనాడులో పర్యటించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్-బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఇటీవలే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే, డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో భేటీ కాలేకపోయారు. గతవారం పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ చీఫ్ ఆ విషయాన్ని స్టాలిన్‌కు ముందుగానే తెలియజేశారు. అయితే, సోమవారం (13న) చెన్నైకి వస్తే కలిసి మాట్లాడుకుందామని ఆయన ఫోన్ చేసి చెప్పారు.  

గత సోమవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాలను సందర్శించిన కేసీఆర్ శుక్రవారం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. దీంతో స్టాలిన్‌తో భేటీ లేనట్టేనని అందరూ భావించారు. అయితే, హైదరాబాద్ చేరుకున్నకేసీఆర్ ముందుగా నిర్ణయించిన ప్రకారం 13న స్టాలిన్‌తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు మరోమారు తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లనున్నారు. శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించిన అనంతరం రాత్రి చెన్నైలో బస చేస్తారు. సోమవారం స్టాలిన్‌తో భేటీ అవుతారు.

More Telugu News