Kidari Sravan: టీడీపీ నన్ను తన కుటుంబ సభ్యుడిలా ఆదరించింది: కిడారి శ్రావణ్

  • అరకు అభివృద్ధికి కృషి చేశా
  • నిబంధనల ప్రకారం రాజీనామా
  • కొత్తవారిని ఎంతగానో ఆదరిస్తారు

కిడారి శ్రావణ్ కుమార్ నేటి మధ్యాహ్నం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలో తన రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సొంత కుటుంబంలోని వ్యక్తిలాగా తనను టీడీపీ ఆదరించిందని తెలిపారు. ఆరు నెలలపాటు మంత్రిగా అరకు నియోజకవర్గ అభివృద్ధికి, గిరిజన అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని పేర్కొన్నారు.

తాను నిబంధనల ప్రకారం రాజీనామా చేయాల్సి వచ్చిందని, చంద్రబాబుతో పాటు పార్టీ నేతలంతా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారిని ఎంతగానో ఆదరిస్తారని శ్రావణ్ తెలిపారు. చట్టసభల్లో సభ్యుడు కాకున్నా ప్రజాసేవ చేసే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించారని ఆయన అన్నారు. 

More Telugu News