Andhra Pradesh: కేంద్రం పరిహారం ఇవ్వనంటోంది.. మరి ఏపీ ప్రభుత్వం రూ.30,000 కోట్లు పెట్టుకోగలదా?: ఉండవల్లి

  • దీనిపై కోర్టుకు వెళ్లాలని చంద్రబాబుకు చెప్పా
  • ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు
  • పోలవరంపై మీడియాతో ఉండవల్లి  

ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా దానిని అవకాశంగా మలచుకోవడమే తన టాలెంట్ అని చంద్రబాబు చెబుతుంటారని సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు పోలవరం విషయంలో పరిస్థితులను అనుకూలంగా ఎందుకు మార్చుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరో ఒకరి చేత ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేయించాలనీ, పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని తానే చంద్రబాబుకు చెప్పానని ఉండవల్లి అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో ఈరోజు నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఉండవల్లి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అన్యాయాలు అన్నింటిని అక్కడి ఇంజనీర్లు తనకు చెబుతున్నారని తెలిపారు. వీటిపై తాను ప్రెస్మీట్ పెట్టి మాట్లాడితే, తనను టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓవైపు డ్యామ్ లేస్తే రెండోవైపు ముంపు ప్రమాదమున్న ప్రాంతాలన్నీ నదీ గర్భంలో కలిసిపోతాయి.

కానీ ఈ ప్రాంతాల ప్రజలకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు కట్టకూడదని సుప్రీం గతంలో తీర్పు ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు ఇప్పటివరకూ నష్టపరిహారం ఇచ్చిందా? కేంద్రం ఈ నిధులను ఇవ్వనంటోంది. మరి రూ.30,000 కోట్లు ఏపీ ప్రభుత్వం పెట్టుకోగలదా? దీనిపై నేను ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News