Mohanbabu: దాసరి ఆస్తుల పంపకంపై నోరు విప్పిన మోహన్ బాబు

  • వీలునామాలో నా పేరు, మురళీమోహన్ పేరు రాయించారు
  • నావంతుగా ఆయన పేరిట చాలా చేశాను
  • కొన్ని చేయలేకపోవడానికి మా అసమర్థతే కారణం

సినీ నటుడు మోహన్ బాబు, దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో అందరికీ తెలుసు. తాజాగా దాసరి టాలెంట్ అకాడమీ 2019 సంవత్సరానికి సంబంధించి షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమానికి మోహన్ బాబు కూడా విచ్చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ, దాసరి నారాయణరావు కుటుంబ వ్యవహారాలను ప్రస్తావించారు.

దాసరిగారు ఆయన ఆస్తుల పంపకం విషయంలో తనను, మురళీమోహన్ ను ఎంతగానో నమ్మారని, వీలునామాలో పర్యవేక్షకులుగా 'మోహన్ బాబు, మురళీమోహన్' అని ప్రత్యేకంగా తమ పేర్లు కూడా రాయించారని వెల్లడించారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ అన్యాయం జరగకూడదన్నది దాసరి గారి ఉద్దేశం అని, అందుకే తామిద్దరి పేర్లు వీలునామాలో పొందుపరిచారని వివరించారు. కానీ, తమ అసమర్థత కారణంగా దాసరి గారి ఆస్తుల పంపకాలను సక్రమంగా నిర్వర్తించలేకపోయామని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని చేశాం, మరికొన్ని చేయలేకపోయాం, అందుకు గల కారణాలు ఏంటో దాసరి కుటుంబానికి, నటి జయసుధకు తెలుసని అన్నారు. అయితే, తనవంతుగా గురువుగారికి ఎంతో చేశానని మోహన్ బాబు వెల్లడించారు. తిరుపతిలో దాసరి పేరుతో 500 మంది విద్యార్థులు కూర్చునే విధంగా ఆడిటోరియం కట్టించానని, ఇది ఆసియాలోనే అత్యుత్తమం అని పేర్కొన్నారు. కాగా, దాసరి టాలెంట్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి నటి జయసుధ, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్. నారాయణమూర్తి, సి. కల్యాణ్ కూడా హాజరయ్యారు.

More Telugu News