Telangana: తెలంగాణకు నీటిని వదిలిన కర్ణాటక... దొంగిలిస్తారని భయం!

  • ఆల్మట్టి నుంచి విడుదలైన నీరు
  • జూరాలకు చేరేందుకు ఆరు రోజుల సమయం
  • దొంగిలించకుండా చూడాలని అంటున్న తెలంగాణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీటికి కరవు ఏర్పడిందని, ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడంతో రెండున్నర టీఎంసీల నీరు ఇచ్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం నాడు ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందగా, ఈ నీటిని దొంగిలిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆల్మట్టి నుంచి విడుదల అయిన నీరు 60 కిలోమీటర్లు ప్రయాణించి నారాయణపూర్ కు, ఆపై 180 కిలోమీటర్లు ప్రయాణించి జూరాలకు చేరాల్సి వుంటుంది. నీరు రావడానికి ఐదు నుంచి ఆరు రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మొత్తం 240 కిలోమీటర్లలో అత్యధిక భాగం కర్ణాటక పరిధిలోనే ఉండటంతో ఎవరూ నీటిని దొంగిలించకుండా చూడాలని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖకు నారాయణపూర్ ప్రాజెక్ట్ ఈఈ లేఖ రాశారు. ఈ నీరు జూరాలకు వస్తే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈ వేసవిలో మంచినీటికి కొరత ఉండదని అధికారులు వ్యాఖ్యానించారు.

More Telugu News