Narendra Modi: ఒడిశాలోని తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో 6న ప్రధాని ఏరియల్‌ సర్వే

  • పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష
  • ఫణి ప్రభావంతో దెబ్బతిన్న పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, కేంద్రపడ జిల్లాలు
  • భువనేశ్వర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కొంత నష్టం

ఫణి తుపాన్‌ ప్రభావంతో భారీగా దెబ్బతిన్న ఒడిశాలోని ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 6వ తేదీన ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక అధికారులతో సహాయక చర్యలు, పునరావాసం తదితర అంశాలపై సమీక్షించనున్నారు. రబీ పంట చేతికొచ్చే తరుణంలో తుపాన్‌ విరుచుకుపడడంతో అన్నదాతపై తీవ్ర ప్రభావం పడింది.

 దాదాపు 6 లక్షల హెక్టార్లలో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జీడి, మామిడి, పనస పంటలు కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, కేంద్రపడ జిల్లాలపై తుపాన్‌ ప్రభావం అధికంగా ఉంది. కటక్‌, గంజాం, జగత్సింగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల్లో పాక్షిక ప్రభావం చూపింది. భువనేశ్వర్‌ స్మార్ట్‌ సిటీకి గట్టి దెబ్బ తగిలింది. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కొంతమేర దెబ్బతింది. పూరీ రైల్వేస్టేషన్‌కు భారీ నష్టం జరిగింది. నష్టం భారీగా ఉండడంతో ప్రధాని పరిశీలన అనంతరం రాష్ట్రానికి ఏ మేరకు సహాయం అందిస్తారో చూడాలి మరి.

More Telugu News