Visakhapatnam District: విశాఖలో ప్రేమ విఫలం.. హైదరాబాద్‌లో ఉరేసుకున్న వైజాగ్ యువతి

  • ప్రియుడికి మరో యువతితో పరిచయం
  • ప్రశాంతత కోసం హైదరాబాద్ పంపిన తల్లిదండ్రులు
  • సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన అంజలి ఉమామహేశ్వరి (23) అక్కడే సిన సెంట్రీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే సంస్థలో ఉద్యోగం చేస్తున్న జాజిబాబుతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో జాజిబాబుకు మరో అమ్మాయి వసుంధరతో పరిచయం ఏర్పడింది. ఆమెతో చాట్ చేస్తుండడాన్ని చూసిన ఉమ.. జాజిబాబును నిలదీసింది. దీంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. జాజిబాబుపై ఉమ విశాఖలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  

దీంతో స్పందించిన ఇరు కుటుంబాల సభ్యులు పెద్దల మధ్యలో పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించారు. అనంతరం గత నెల 25న ఉమ తల్లిదండ్రులు కుమార్తెను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్న మరో కుమార్తె పావని వద్ద వదిలిపెట్టి వెళ్లారు. ఉమ హైదరాబాద్ వచ్చిన తర్వాత జాజిబాబు మరో ప్రియురాలైన వసుంధర నుంచి ఆమెకు మెసేజ్‌లు వచ్చాయి.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉమ బెడ్‌రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News