Narendra Modi: సర్జికల్ దాడులను కాంగ్రెస్ వేళాకోళం చేసింది.. ఇప్పుడు ‘మీటూ..మీటూ’ అని అరుస్తోంది!: ప్రధాని నరేంద్ర మోదీ

  • కాంగ్రెస్ సర్జికల్ దాడులు చేస్తే ఉగ్రవాదులకే తెలియలేదు
  • కనీసం భారతీయులకు కూడా చెప్పలేదు
  • మేం సర్జికల్ దాడి చేస్తే అందరికీ తెలిసింది
  • రాజస్తాన్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా 6 సార్లు సర్జికల్ దాడులు చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్జికల్ దాడులు చేస్తే అది ఉగ్రవాదులకు కూడా తెలియలేదని ఎద్దేవా చేశారు. ఈ సర్జికల్ దాడుల గురించి పాకిస్థాన్ కు తెలియలేదనీ, కనీసం సొంత భారతీయులకు కూడా తెలియకుండానే దాడులు జరిగాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజస్థాన్ లోని సికర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు.

‘కాంగ్రెస్ హయాంలో సర్జికల్ దాడులు జరిగిన విషయం టెర్రరిస్టులకు తెలియలేదు.  పాకిస్థాన్ కు ఏమాత్రం తెలియదు. చివరికి సొంత భారతీయులకు కూడా ఈ విషయం తెలియలేదు. యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రెయిక్ జరిగినట్లు మీరు(ప్రజలు) ఎప్పుడైనా విన్నారా? బీజేపీ ప్రభుత్వం వచ్చాక పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన సర్జికల్ దాడులను దేశమంతా చూసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు.

తాము సర్జికల్ దాడులు చేశామని చెప్పగానే ‘ఇలాంటివి రోజూ సైన్యం చేస్తూనే ఉంటుంది’  అని కాంగ్రెస్ నేతలు వెక్కిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ దేశప్రజలకు తనపై నమ్మకం ఉండటంతో వారంతా తన వెంట నిలబడ్డారని అన్నారు. దీంతో సర్జికల్ దాడులకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారనీ, తద్వారా ప్రజలు తనకు మరింతగా దగ్గరయ్యారని తెలిపారు. ‘దీంతో మరో మార్గం లేక మేం కూడా సర్జికల్ దాడులు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. దీనివల్ల మోదీపై ఉన్న ప్రేమలో 2-5 శాతం తమకూ దక్కవచ్చని ఆ పార్టీ నేతలు ఆశపడుతున్నారు. మీటూ.. మీటూ అని అరుస్తున్నారు’ అనిమోదీ సెటైర్ వేశారు.


  • Loading...

More Telugu News