Andhra Pradesh: ‘ఈనాడు’ అధినేత రామోజీరావుపై క్రిమినల్, సివిల్ కేసులు పెట్టండి!: రిటైర్డ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు పిటిషన్

  • అనంతపురంలోని మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు
  • తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు రాశారని మండిపాటు
  • విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కోర్టు

ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు, గ్రూప్ ఎండీ కిరణ్ లపై ఏఎస్పీ(రిటైర్డ్) వెంకటేశ్వరరావు ఈరోజు అనంతపురం మొబైల్ కోర్టులో పరువు నష్టం దావాను దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు రామోజీరావు, కిరణ్‌ వ్యక్తిగతంగా హాజరై అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ కుదరని పక్షంలో స్టే గడువును పెంచుకోవాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.

తనపై తప్పుగా కథనాలు రాశారంటూ రిటైర్డ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు ఉమ్మడి హైకోర్టులో 2012లో పరువు నష్టం దావా దాఖలు చేశారు. రామోజీరావు, కిరణ్ లపై క్రిమినల్, సివిల్ కేసు నమోదు చేయాలని కోరారు. అయితే అదే ఏడాది వీరిద్దరూ విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. కానీ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. దీంతో వెంకటేశ్వరరావు అనంతపురంలోని మొబైల్ కోర్టును ఆశ్రయించారు.

More Telugu News