Congress: 'ఆరుసార్లు సర్జికల్ దాడి చేశాం... మీలా ఛాతీ చరుచుకోలేదు'... తేదీలతో సహా చెప్పిన కాంగ్రెస్!

  • 2008 నుంచి 2014 మధ్య దాడులు
  • పీఓకేలోని పలు పోస్ట్ లపై ఎటాక్ 
  • ఫోటోలతో సహా విడుదల చేసిన రాజీవ్ శుక్లా

2008 నుంచి 2014 మధ్య పాకిస్థాన్ పై భారత సైన్యం ఆరుసార్లు లక్షిత దాడులను నిర్వహించిందని, వాటిని బయటకు చెప్పుకోలేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఎప్పుడెప్పుడు సర్జికల్ దాడులు చేశామన్న విషయాన్ని తేదీలతో సహా ప్రకటిస్తూ, ఫోటోలను విడుదల చేసింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో జాతీయ భద్రతాంశాలను బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారుస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా, తామెన్నడూ లక్షిత దాడుల గురించి చెప్పి ఛాతీని చరుచుకోలేదని అన్నారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తొలి సర్జికల్ డాడిని పాక్ లోని పూంఛ్ సెక్టార్ కు చెందిన బట్టాల్ లో జనవరి 19, 2008న జరిపామని ఆయన తెలిపారు. రెండో దాడి ఆగస్టు 30, 2011న పీవోకేలోని కేల్‌ ప్రాంతంలోని నీలుమ్‌ నదీ లోయలో, ఆపై జనవరి 6, 2013న సవన్‌ పాత్ర చెక్‌ పోస్టుపై సర్జికల్ దాడులు చేశామని అన్నారు. జూలై 27, 2013న నాజాపూర్‌ సెక్టార్‌ లో, అదే సంవత్సరం ఆగస్టు 6న నీలమ్ నదీ లోయలో, జనవరి 14, 2014న నీలమ్ నదీలోయలోనే దాడులు చేశామని అన్నారు.

కాగా, తాను ప్రధానిగా ఉన్న సమయంలో పలు మార్లు లక్షిత దాడులు చేశామని, కానీ తాము ప్రచారం చేసుకోలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ మాట్లాడిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ తమ సర్జికల్ స్ట్రయిక్స్ ను తేదీలు, ఫోటోలతో సహా వెల్లడించడం గమనార్హం.

More Telugu News