Maharashtra: మహారాష్ట్రలో మావోల పంజా.. ఐఈడీ బాంబు పేల్చి 16 మంది జవాన్ల దారుణహత్య!

  • గడ్చిరోలిలో బలగాల కాన్వాయ్ లక్ష్యంగా దాడి
  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • అంతకుముందు 36 వాహనాలకు నిప్పు

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దారుణానికి తెగబడ్డారు. గడ్చిరోలి జిల్లాలో భద్రతాబలగాలతో వెళుతున్న ఓ వాహనాన్ని శక్తిమంతమైన ఐఈడీతో ఈరోజు పేల్చివేశారు. ఈ దుర్ఘటనలో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ డ్రైవర్, 15 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఐఈడీ పేలుడు తీవ్రతకు జవాన్ల వాహనం తుక్కుతుక్కయింది. రోడ్డు మధ్యలో భారీ గొయ్యి ఏర్పడింది. బాంబు దాడి అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా, దాడి నుంచి తప్పించుకున్న జవాన్లు ఎదురుకాల్పులు జరుపుతున్నారు.

ఈరోజు మధ్యాహ్నం గడ్చిరోలికి బలగాల కాన్వాయ్ వెళుతుండగా, మావోయిస్టులు ఐఈడీ పేల్చినట్లు సమాచారం. అంతకుముందు ఇదే జిల్లాలో పురాందా-మాలేగావ్‌-యెర్కడ్‌ జాతీయ రహదారి నిర్మిస్తున్నందుకు కోపంతో మావోలు 36 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రూ.10కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు మహారాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలోనే మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

More Telugu News