Crime News: మహిళా కానిస్టేబుల్‌ను హత్యచేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ప్రియుడు

  • నిందితుడు కూడా కానిస్టేబుల్‌
  • ఒకే స్టేషన్‌లో పనిచేస్తుండగా ప్రేమలో పడిన ఇద్దరూ
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురంలో ఘటన

తన ప్రియురాలు మరొకరితో సన్నిహితంగా ఉండడం తట్టుకోలేని ప్రియుడు ఆమెను హత్యచేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ కానిస్టేబుళ్లు కావడం గమనార్హం. పోలీసులతోపాటు, హతురాలి తండ్రి సదానందం తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన ప్రకాశ్‌, సదాశివపేట మండలం మేకవనంపల్లి గ్రామానికి చెందిన మందారికలు కానిస్టేబుళ్లు. కొన్నాళ్ల క్రితం ఇద్దరూ సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే వారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారి కొనసాగింది. కొన్నాళ్ల తరువాత హత్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు ప్రకాశ్‌, రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌కు మందారికలు బదిలీ అయ్యారు. వేర్వేరు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నా ఇద్దరి మధ్యా ప్రేమ కొనసాగింది. అప్పుడప్పుడూ కలిసి బయటకు వెళ్లేవారు.

ఈ క్రమంలోనే సోమవారం విధుల నిర్వహణ పూర్తయ్యాక మందారిక, ప్రకాశ్‌లు బయటకు వెళ్లారు. ఆ తర్వాత మందారిక తిరిగి ఇంటికి చేరుకోలేదు. అనుమానం వచ్చిన ఆమె తండ్రి రామచంద్రాపురం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా మందారిక హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు.

మందారిక వేరొకరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయిన ప్రకాశ్‌ ఆమెను చంపేయాలనుకున్నాడు. తన ప్లాన్ లో భాగంగా మందారికను సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామ శివారుకు తీసుకువెళ్లి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్‌ పోసి శవాన్ని తగలబెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు వెనక్కి వచ్చేశాడు. మందారిక తండ్రి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు ఘోరం బయటపడింది.

  • Loading...

More Telugu News