ఎస్పీవై రెడ్డి మరణంపై స్పందించిన వైఎస్ జగన్!

  • అనారోగ్యంతో కేర్ లో చేరిన జనసేన నేత
  • చికిత్స పొందుతూ నిన్న మృతి
  • కడప జిల్లా పులివెందులలో జననం
నంద్యాల లోక్ సభ సభ్యుడు, జనసేన నేత ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నంది గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి (69) కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రెడ్డి.. గత నెల 3న ఆరోగ్యం విషమించడంతో కేర్ లో చేరారు. ఎస్పీవై రెడ్డి మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకాలమ్మ గూడూరులో 1950లో ఎస్పీవై రెడ్డి జన్మించారు.

2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌ సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Go Back to Shorts
spy reddy
Jana Sena
Jagan
YSRCP

More Telugu News