Rahul Gandhi: మోదీజీ.. తగలబడిన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవు.. శాస్త్రి భవన్‌లో అగ్ని ప్రమాదంపై రాహుల్ ట్వీట్

  • భవనంలోని ఆరో అంతస్తులో అగ్నిప్రమాదం
  • నష్టంపై లేని స్పష్టమైన సమాచారం
  • జడ్జిమెంట్ డే వస్తోందంటూ రాహుల్ ట్వీట్

ఢిల్లీలోని ‘శాస్త్రి భవన్’లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం అనంతరం ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విరుచుకుపడ్డారు. శాస్త్రి భవన్‌లో తగలబడిన ఫైళ్లు మోదీని కాపాడలేవంటూ ఘాటు ట్వీట్ చేశారు. న్యాయశాఖ, సమాచార.. ప్రసార శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు, రసాయనాలు, పెట్రో కెమికల్స్, మానవ వనురల అభివృద్ధి మంత్రిత్వ శాఖలన్నీ ఇదే భవనంలో ఉన్నాయి. వివిధ శాఖలకు చెందిన పైళ్లను స్టోర్ చేసే గది కూడా ఇందులోనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం భవనంలోని ఆరో అంతస్తులో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.

తుక్కు, పనికి రాని ఫర్నిచర్, పాడైన కంప్యూటర్లు నిల్వ చేసిన ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై రాహుల్ స్పందిస్తూ.. కాలిబూడిదైన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవంటూ ప్రధానిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. త్వరలోనే మీ జడ్జిమెంట్ డే రాబోతోందని రాహుల్ పేర్కొన్నారు.  

More Telugu News