Jagan: ఇంటర్ విద్యార్థుల సమస్యపై స్పందించకుండా ఓ బూతు డైరెక్టర్ కోసం ట్వీట్ చేస్తారా?: జగన్ ను నిలదీసిన దివ్యవాణి

  • రాష్ట్రంలో సమస్యలేమీ లేవా?
  • ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో నేర్చుకోండి
  • మంచి మనసుతో ఆలోచించండి

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత దివ్యవాణి విరుచుకుపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దివ్యవాణి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా జగన్ ట్వీట్ చేయడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయని, నీటిఎద్దడితో అల్లాడిపోయే పరిస్థితి నెలకొందని, మరోవైపు తెలంగాణలో 20 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో  సమస్యలేమీ లేనట్టు ఓ బూతు డైరెక్టర్ కు ప్రతిపక్ష నేత మద్దతివ్వడమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓవైపు తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల సమస్య తీవ్రరూపం దాల్చితే జగన్ దానిపై స్పందించకుండా, బూతు సినిమాలు తీసుకునే దర్శకుడి కోసం ట్విట్టర్ లో స్పందించడాన్ని ఏమనాలి? అంటూ నిలదీశారు. ప్రజల సమస్యలు వెలికితీస్తూ, వాటికి పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంటుందని, జగన్ ప్రతిపక్ష నేతగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని, మంచి మనసుతో ఆలోచించడం అలవర్చుకోవాలని దివ్యవాణి హితవు పలికారు.

More Telugu News