Gadwala: శుభకార్యానికి ట్రాక్టర్‌లో.. బోల్తాపడి ముగ్గురి మృతి

  • జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
  • హైవేపై బోల్తాపడిన ట్రాక్టర్ 
  • మరో 8 మంది పరిస్థితి విషమం

శుభకార్యంలో పాల్గొనేందుకు ట్రాక్టర్‌లో వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని జింకలపాడులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల మండలం జమ్మిచేడు గ్రామంలో నేడు ఉత్సవం నిర్వహించాలని మానవపాడు మండలం పొట్లపాడుకు చెందిన మల్లికార్జున కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం రాత్రి బంధువులతో కలిసి ట్రాక్టర్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో జింకలపాడు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి జారుకుని బోల్తాపడింది.  ప్రమాదంలో మల్లికార్జున్‌(40), పార్వతమ్మ(40), ప్రత్యూష(12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

More Telugu News