Telangana: విద్యార్థుల కారణంగానే కేసీఆర్ సీఎం అయ్యారు.. వారివల్లే సర్వనాశనం కూడా అవుతారు!: బీజేపీ నేత రాజాసింగ్

  • ఇంటర్ మరణాలకు కేసీఆరే కారణం
  • పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకుంటారా?
  • ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల మరణాలకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ అన్నది కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాల వల్ల రాలేదనీ, విద్యార్థుల ఆత్మబలిదానాల వల్ల వచ్చిందని గుర్తుచేశారు.

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు ఇంటర్ బోర్డు వద్ద చేపట్టిన ఆందోళనను సైతం అడ్డుకున్నారనీ, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ను సైతం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 23 మంది ఇంటర్ పిల్లలు తమ ప్రాణాలు తీసుకున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటే దానికి బాధ్యుడు ఎవరు? మీరే కేసీఆర్ గారు. వాళ్లకు న్యాయం చేయడం మీకు చేతకాదు. పిల్లల కోసం పోరాడినందుకు మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేస్తారు.

రజాకార్ల పాలనలో హిందువులపై ఈ తరహా దౌర్జన్యం జరిగేది. ఆ తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ స్థాయిలో దౌర్జన్యం జరుగుతోంది. మీరు ఓ రజాకార్ గా తయారు అయిపోయారు’ అని రాజాసింగ్ దుయ్యబట్టారు. తెలంగాణ విద్యార్థుల వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారనీ, ఆ విద్యార్థుల కారణంగానే ఆయన సర్వనాశనం అవుతారని   రాజాసింగ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు రాజాసింగ్ ట్విట్టర్ లో వీడియో విడుదల చేశారు.

More Telugu News