Fani: ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫణి
  • మచిలీపట్నానికి 1,230 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ఈ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫణి తుపాను క్రమంగా బలపడుతోంది. ఈ సాయంత్రానికి అది తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ విభాగం పేర్కొంది. ప్రస్తుతం ఫణి తుపాను మచిలీపట్నానికి 1,230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫణి తుపాను మే 3 వరకు బంగాళాఖాతంలోనే తీవ్ర తుపానుగా కొనసాగి ఆపై ఏపీ తీర సమీపానికి వస్తుందని, అనంతరం దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు సాగిపోతుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News