phoni syclone: బలపడుతున్న తుపాన్‌... ఏపీకి పొంచివున్న ముప్పు

  • 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదలిక
  • మరో 12 గంటల్లో తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం
  • 30 నాటికి దిశ మార్చుకునే అవకాశం

ఫణి తుపాన్‌ తీరంవైపు వేగంగా దూసుకువస్తోంది. ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ కదులుతున్న తుపాన్‌తో ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ కేంద్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకలోని ట్రింకోమలికి 750 కిలోమీటర్లు, చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచిలీపట్నంకు 1260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇది మరో 24 గంటల్లో బలపడి పెను తుపాన్‌గా మారే అవకాశం ఉందని, 30వ తేదీ నాటికి దిశ మార్చుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. తుపాన్‌ కదలికలను బట్టి ఈశాన్య బంగాళాఖాతం దిశగా మరలి, కోస్తాంధ్రా తీరం వెంట ప్రయాణించి బంగ్లాదేశ్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని పలు ప్రైవేటు వాతావరణ వెబ్‌ సైట్లు పేర్కొంటున్నాయి.

ఈ కారణంగా మే ఒకటో తేదీ నుంచి నాల్గో తేదీ వరకు ఏపీ తీరం వెంబడి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం కదిలే అవకాశం ఉందని, అనంతరం ఒడిశా తీరం వైపు వెళ్లి బంగ్లాదేశ్‌ వైపు కదులుతుందని అంచనా వేస్తున్నాయి. తుపాన్‌ ప్రభావం కారణంగా బంగాళాఖాతంలో 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఈ వేగం 90 నుంచి 115 కిలోమీటర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సోమవారం నాటికి గాలుల వేగం 145 నుంచి 175 కిలోమీటర్లకు పెరిగి ఆ ప్రభావం ఏపీ తీరంతోపాటు తమిళనాడు, పుదుచ్చేరిపై కనిపిస్తుందంటున్నారు. మే రెండో తేదీ నాటికి గాలుల వేగం కాస్త తగ్గే అవకాశం ఉందంటున్నారు. కాగా తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.

More Telugu News