Vijayanagaram District: మేడపై నిద్రిస్తున్న వ్యక్తిపై దాడిచేసి హత్య: విజయనగరం జిల్లాలో దారుణం

  • మృతుడు గరివిడి హడ్కోకాలనీ వాసి
  • ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసిన దుండగులు
  • దొంగలనుకున్న కుటుంబ సభ్యులు

వేసవి తాపం అధికంగా ఉండడంతో చల్లగా ఉంటుందని ఇంటి మేడపైకి వెళ్లి నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేసిన సంఘటన ఇది. విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలోని హడ్కో కాలనీలో చోటు చేసుకున్న ఈ విషాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కాలనీకి చెందిన పి.చిన్నబాబుపాత్రుడు (55) శనివారం రాత్రి మేడపై పడుకుని ఉన్నాడు.

అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు మేడపైకి వచ్చి అతనిపై ఇనుప రాడ్డుతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన పాత్రుడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం పారిపోతున్న దుండగులను గమనించిన కుటుంబ సభ్యులు తొలుత దొంగలనుకున్నారు. అనుమానంతో మేడపైకి వెళ్లి చూడగా చిన్నబాబు విగత జీవిగా పడివుండడం గమనించి గొల్లుమన్నారు.

వెంటనే గరివిడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలిని సందర్శించారు. క్లూస్‌ టీం, డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

More Telugu News