Andhra Pradesh: మూడు వారాల సంబరానికే ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎగిరెగిరి పడుతున్నారు: బ్రాహ్మణ చైతన్య వేదిక

  • ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎల్వీ 11వ ముద్దాయి
  • అయినా బుద్ధి రావడం లేదు
  • సుబ్రహ్మణ్యాన్ని రిటైర్డ్ ఐఏఎస్‌లు పావుగా వాడుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బ్రాహ్మణ చైతన్య వేదిక మండిపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిందితుడిగా ఉన్న ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సుబ్రహ్మణ్యం ఎ-11 ముద్దాయిగా ఉన్నప్పటికీ ఆయనకు ఇంకా బుద్ధి రాలేదని వేదిక రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ అన్నారు. ఆయన తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మూడు వారాల సంబరానికే ఆయన ఓవరాక్షన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇతర రిటైర్డ్ ఐఏఎస్‌లు సుబ్రహ్మణ్యాన్ని పావుగా వాడుకుంటూ చంద్రబాబును ఏదో చేయాలని చూస్తున్నారని అన్నారు.

ఐవైఆర్, విజయసాయిరెడ్డి కలిసి పథకం ప్రకారం టీటీడీ ప్రతిష్ఠను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో ఏడు కొండలు ఎందుకని, రెండు కొండలు చాలని అప్పట్లో వైఎస్ అన్నప్పుడు  ఐవైఆర్‌, అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు నోరు మెదపలేదని శ్రీధర్ నిలదీశారు.

More Telugu News