West Bengal: బీజేపీ నేత కోళ్ల ఫారానికి నిప్పు.. సజీవదహనమైన 2500 కోళ్లు!

  • పశ్చిమబెంగాల్ లోని బీర్భూం జిల్లాలో ఘటన
  • హింసాత్మకంగా మారుతున్న రాజకీయాలు
  • టీఎంసీ నేతలే చేశారని బీజేపీ నేత ఆరోపణ

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్ లో రాజకీయం హింసాత్మకంగా మారుతోంది. ఇటీవల సీపీఎం నేత మొహమ్మద్ సలీం కాన్వాయ్ ను 500 మంది దుండగులు కర్రలు, తుపాకులతో వెంబడించి దాడి చేశారు. అంతేకాకుండా బీజేపీ మద్దతుదారుడైన శిశుపాల్ సాహిస్(22) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు చెట్టుకు ఉరివేసి చంపేశారు. తాజాగా ఈ గొడవలు ఆస్తుల విధ్వంసానికి పాకాయి. బీజేపీ నేత గుప్తాకు చెందిన ఓ కోళ్ల ఫారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి తగలబెట్టారు.

ఈ ఘటనలో సదరు కోళ్ల ఫారంలో ఉన్న 2,500 కోళ్లూ కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితుడు గుప్తా మాట్లాడుతూ. అధికార టీఎంసీ పార్టీ కార్యకర్తలే ఈ దారుణానికి తెగబడ్డారని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News