Rohit Tiwari: రోహిత్ తివారి హత్య కేసులో భార్య అపూర్వను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ముఖంపై దిండుతో అదిమి హత్య
  • 16న విగతజీవిగా కనిపించిన రోహిత్
  • హత్యేనని తేల్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్టు

యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ తివారిని హత్య చేసింది ఆయన భార్య అపూర్వేనని అనుమానిస్తున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న రోహిత్ ముఖంపై దిండుతో గట్టిగా అదిమి అపూర్వే హత్య చేసిందన్న అభియోగాలను నమోదు చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్లయింది.

ఈ నెల 16న రోహిత్ మరణించగా, పోస్ట్ మార్టమ్ తరువాత అది సహజమరణం కాదని, హత్య చేశారని తేలడంతో, పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా అపూర్వను మూడు రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులకు ఆమె పైనే అనుమానం వచ్చింది. రోహిత్ తల్లి సైతం, పెళ్లి తరువాత వారు సఖ్యంగా లేరని, నిత్యమూ గొడవలు పడుతూ ఉండేవారని పోలీసులకు చెప్పడంతో వారు ఆమెను గట్టిగా ప్రశ్నించేసరికి అసలు నిజం ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News