Crime News: విశాఖ జిల్లా పెందుర్తిలో పురోహితుడి అనుమానాస్పద మృతి

  • హత్యా? ఆత్మహత్యా? ప్రమాదమా?
  • భార్యతో విభేదాల కారణంగా మనస్తాపం
  • మద్యపానం, ధూమపానానికి బానిస

విశాఖ జిల్లా పెందుర్తి మండల కేంద్రంలో ఓ పురోహితుడు సజీవ దహనం కావడం స్థానికంగా సంచలనమయింది. ఇతను ప్రమాదవశాత్తు చనిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపేశారా? అన్న రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెందుర్తి పశువుల ఆసుపత్రి వెనుక భాగంలో నివసిస్తున్న వెంకటేశ్వరరావు వృత్తి పౌరోహిత్యం.

కొన్నేళ్ల క్రితం పెందుర్తి వలస వచ్చి స్థానికంగా పౌరోహిత్యం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. భార్యతో విభేదాల కారణంగా ఆమెకు దూరంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పైగా మద్యానికి, ధూమపానానికి బానిసయ్యాడని, నిత్యం అదే మత్తులో ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తన ఇంట్లోనే సజీవ దహనం అయ్యాడు. ప్రమాదంలో అతని శరీరం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

పూటుగా మద్యం సేవించి సిగరెట్‌ తాగుతూ మత్తులోకి జారుకుని ఉంటాడని, అతను తాగగా మిగిలిన మద్యం పడిపోవడంతో సిగరెట్‌ నిప్పు నుంచి మంటలు అంటుకుని చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News