Rashmika Mandanna: సీన్ పండటం కోసం రష్మికను నిజంగానే ఏడిపించిన దర్శకుడు!

  • టాలీవుడ్ లో బిజీగా మారిపోయిన కన్నడ భామ
  • 'గీత గోవిందం' సినిమా షూటింగ్ సమయంలో ఘటన
  • ఒరిజినల్ ఎమోషన్ కోసం రష్మికను ఏడిపించిన పరశురామ్!

'ఛలో', 'గీత గోవిందం' సినిమాలతో టాలీవుడ్ లో బిజీగా మారిపోయిన కన్నడ భామ రష్మిక మందన్న త్వరలోనే మహేశ్ బాబు సరసన, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, 'గీత గోవిందం' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు పరశురామ్ తనను నిజంగానే ఏడిపించాడని చెప్పింది.

షూటింగ్ జరుగుతుండగా, కాస్తంత ఆలస్యంగా రష్మిక సెట్ కు వెళ్లిందట. దీంతో అక్కడున్నవారంతా సీరియస్ గా ఎవరి పనిలో వారుండి, రష్మిక వైపు కన్నెత్తి కూడా చూడలేదట, పలకరించలేదట. దీంతో తాను పొరపాటు చేశానన్న భావనలో పడిపోయిన రష్మికకు కన్నీరు ఆగలేదట.

కాసేపటి తరువాత ఆమె దగ్గరకు వచ్చిన పరశురామ్, ఓ సీన్ లో ఒరిజినల్ ఎమౌషన్ కోసం ఇలా ఏడిపించాల్సి వచ్చిందని చెప్పాడట. ఆ సీన్ ను కాప్చర్ చేశామని, ఇక ఏడుపు ఆపేయవచ్చని అనడంతో రష్మిక కూడా ఊపిరి పీల్చుకుంది. ఇక, సినిమాలో ఏ సీన్ కోసం పరశురామ్ తనను ఏడిపించాడన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు.

More Telugu News