Telangana: ఇంటర్ బోర్డు వద్ద ధర్నా.. ప్రొ.నాగేశ్వర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • విద్యార్థులకు మద్దతుగా ప్రొ.నాగేశ్వర్ ఆందోళన
  • అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • గ్లోబరినా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని తల్లిదండ్రుల డిమాండ్

తెలంగాణలో ఇంటర్ ఫలితాల వ్యవహారంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్‌ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌  ప్రయత్నించింది. ఇంటర్ పరీక్షా ఫలితాల బాధ్యతలను చేపట్టిన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News