Telangana: దేశంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం బీజేపీయే: మంత్రి తలసాని

  • సున్నితమైన అంశాలను బీజేపీ రాజకీయం చేస్తోంది
  • పోలీసుల మనో స్థయిర్యం దెబ్బతీసేలా వ్యాఖ్యలు తగదు
  • కాంగ్రెస్ పార్టీ పైనా విరుచుకుపడ్డ తలసాని

దేశంలో ఉగ్రవాదం పెరగడానికి భారతీయ జనతా పార్టీయే కారణమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓట్ల కోసం సున్నితమైన అంశాలను బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పోలీసుల మనో స్థయిర్యం దెబ్బతీసేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని ఎంఐఎంతో ముడిపెట్టడం సబబు కాదని బీజేపీ నేతలకు హితవు పలికారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బ్యాలెట్ పద్ధతి బాగుంటుందని అంటున్న ఉత్తమ్, ఈవీఎంలు ఉన్నప్పుడు గెలవలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఆ పార్టీ కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు.

More Telugu News