Andhra Pradesh: న్యాయవ్యవస్థను నీరుగార్చి లబ్ధిపొందాలని కుట్రలు చేస్తున్నారు!: టీడీపీ నేత కనకమేడల

  • గౌరవప్రదమైన వ్యక్తులను అల్లరి చేయడాన్ని ఖండించాలి
  • న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది
  • జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యవహారంపై స్పందించిన నేత

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారని  జూనియర్ అసిస్టెంట్ గా సుప్రీంకోర్టులో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి(35) ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను ఆయనకు లొంగకపోవడంతో తన కుటుంబాన్ని తప్పుడు కేసులతో గొగోయ్ వేధిస్తున్నారని ఆమె 22 మంది సుప్రీం జడ్జీలకు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు.

ఢిల్లీలో ఈరోజు కనకమేడల మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులను అల్లరి చేయడాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై మేధావులు స్పందించాలని కోరారు. న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్యానించారు. కొందరు న్యాయవ్యవస్థను నీరుగార్చి లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న న్యాయవ్యవస్థపై దాడిని భవిష్యత్ తరాలు క్షమించవని హెచ్చరించారు. కాగా, సదరు మాజీ ఉద్యోగిని ఫిర్యాదుపై జస్టిస్ ఖన్నా, జస్టిస్ మిశ్రాతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటుచేసిన జస్టిస్ గొగోయ్, ఈ కేసులో అవసరమైతే తదుపరి ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేశారు.

More Telugu News