bihar: కన్నతల్లి ముందే కుమార్తెపై లైంగిక వేధింపులు.. యువతి ప్రతిఘటించడంతో ముఖంపై యాసిడ్ దాడి!

  • బిహార్ లోని భాగల్పూర్ లో ఘటన
  • 11వ తరగతి యువతిపై పక్కింటి వ్యక్తి కన్ను
  • పట్నా మెడికల్ కాలేజీకి బాధితురాలి తరలింపు

బిహార్ లో కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన దుండగులు యువతిని వేధించడం మొదలుపెట్టారు. అడ్డువచ్చిన కన్నతల్లి తలపై తుపాకీ గురిపెట్టారు. ఈ వేధింపులను యువతి ప్రతిఘటించడంతో ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బిహార్ లోని భాగల్పూర్ లో ఓ యువతి(17) తన తల్లితో కలిసి ఉంటోంది. స్థానికంగా ఉండే ఓ కళాశాలలో ఆమె 11వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో పక్కింట్లో ఉంటే ఓ ప్రిన్స్ అనే వ్యక్తి ఈ యువతిపై కన్నేశాడు. నిన్న రాత్రి ముగ్గురు అనుచరులతో కలిసి యువతి ఇంట్లోకి చొరబడి ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. యువతి కేకలు విన్న తల్లి అక్కడకు రాగానే ఆమె కణతపై తుపాకీ గురిపెట్టాడు. అరిస్తే తుపాకీతో కాల్చిచంపేస్తానని బెదిరించాడు. అనంతరం వేధింపులను కొనసాగించాడు. అయితే ప్రిన్స్ వేధింపులను యువతి ప్రతిఘటించడంతో నిందితులు రెచ్చిపోయారు.

వెంటతెచ్చుకున్న యాసిడ్ ను యువతి ముఖంపై  పోసి పరారయ్యారు. యాసిడ్ మంట తాళలేక యువతి కేకలు వేయడంతో స్థానికులు, ఇరుగుపొరుగు వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలంలో యాసిడ్ బాటిల్ తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రిన్స్ ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం పట్నా మెడికల్ కాలేజీకి తరలించారు. యాసిడ్ దాడితో యువతికి తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయనీ, అయితే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News