Andhra Pradesh: రహస్య జీవోలతో బాబు ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు!: ఆనం రామనారాయణ రెడ్డి

  • బాబు పాలనలో ఏపీ ఆర్థికస్థితి పూర్తిగా దిగజారింది
  • ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది
  • నెల్లూరులో మీడియాతో వైసీపీ నేత

టీడీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. చంద్రబాబు విధానాల కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులను ఇబ్బంది పెట్టేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు.

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీ ఆస్తులు పెరగకపోగా, అప్పులు పెరిగాయని ఆనం దుయ్యబట్టారు. టీడీపీ అధినేత రహస్య జీవోలతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అలాగే సమీక్షల పేరుతో ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ జీవోలను బయటపెట్టాలని గవర్నర్ ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెట్టాలన్నారు. ఈ వ్యవహారంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

More Telugu News