Chandrababu: మోదీ అన్నీ హామీలే ఇస్తారు, ఏమీ చేయరు... అమరావతి విషయంలో మోసం చేశారు: చంద్రబాబు

  • రాయచూర్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • మోదీపై తీవ్ర విమర్శలు
  • సోనియాపై భరోసా

ఏపీకి హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఆయన ఇవాళ కర్ణాటకలోని రాయచూర్ లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతికి ఆర్థిక సాయం చేయకుండా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అన్నీ హామీలే ఇస్తారు తప్ప చేతల్లో ఏమీ చేయరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైనే పెడతామని సోనియా తెలిపారని, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారని చంద్రబాబు వివరించారు.

"మోదీ తీసుకున్న ఏ నిర్ణయం కూడా సఫలం కాలేదు. జీఎస్టీతో వ్యాపారులంతా దారుణంగా దెబ్బతిన్నారు. ఎప్పుడూ లేనివిధంగా మోదీ పాలనలో రూపాయి విలువ బాగా పతనమైంది. బీజేపీ ఆర్థిక విధానాలు దేశాన్ని తీవ్రంగా నష్టపరిచాయి. చివరికి రాఫెల్ స్కాం ద్వారా రక్షణ శాఖలో కూడా అవినీతికి పాల్పడిన వ్యక్తి ఈ నరేంద్ర మోదీ. ఆయన పాలనలో పెరిగింది అవినీతిపరులు తప్ప మరొకరు కారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు. పెద్దనోట్ల రద్దు అన్నారు, ఏం జరిగింది? దేశంలో 2 శాతం వృద్ధి ఆగిపోయింది.

మోదీ వచ్చిన తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. దేశాన్ని అన్ని విధాలా దిగజార్చారు. సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలను నాశనం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో మనదేశం పదో స్థానంలో ఉందంటే మోదీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీ పాలనలో మహిళలకు భద్రత లేదని అనేక ఘటనలు నిరూపించాయి. జమ్మూకశ్మీర్ యువత తీవ్రవాదులుగా మారారు.

బీజేపీ నేతలు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఓట్లు కొంటున్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని ఎన్నడూ లేనంతగా దారుణమైన రీతిలో దుర్వినియోగం చేశారు.

బీజేపీ, మోదీ ఓడిపోతేనే దేశానికి విముక్తి. ఇప్పుడు కర్ణాటకలో ఎన్డీయేకు ఎదురుగాలి వీస్తోంది. ఈ ప్రభంజనంలో బీజేపీ అభ్యర్థులకు ఓటమి తప్పదు.  మోదీ తదితరులు ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీలో తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టబోతున్నాం. దక్షిణ భారతదేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలే వస్తున్నాయి" అంటూ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సభలో చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.

More Telugu News