KCR: ఫెడరల్ ఫ్రంట్ పేరుతో విపరీతమైన హడావుడి చేసిన కేసీఆర్ కు ఇప్పుడేమైంది?: విజయశాంతి

  • కేసీఆర్ మౌనం ఎందుకో తెలియడంలేదు
  • తెలంగాణలో ఎన్నికలైపోగానే గాలికొదిలేశారు
  • కేసీఆర్ మాట ఫెడరల్ ఫ్రంట్ వైపు, మనిషి మాత్రం మోదీ వైపు!

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థంకావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిన్నమొన్నటిదాకా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో విపరీతమైన హడావుడి చేసిన ఆయనకు ఇప్పుడు ఏమైంది? అంటూ సందేహం వెలిబుచ్చారు.

"జాతీయ పార్టీలను ఏకం చేస్తాను, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి వరుసగా సమావేశాలు జరిపారు. మరి ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామికి అన్నీ తానై గెలిపించానని కేసీఆర్ చెప్పుకున్నారు. మరి లోక్ సభ ఎన్నికల వేళ ఒక్కసారి కూడా కర్ణాటకలో ఎందుకు అడుగుపెట్టనట్టో!

జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగడతానని నానా హంగామా చేసి ఇప్పుడా విషయాన్ని గాలికొదిలేశారు. తాను గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఎవరెవర్ని కలిశాడో కనీసం వాళ్ల తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్లడంలేదు. దానర్థం, కేసీఆర్ మాట ఫెడరల్ ఫ్రంట్ వైపు, మనిషి మాత్రం మోదీ వైపు అని స్పష్టమవుతోంది" అంటూ విమర్శలు గుప్పించారు.

More Telugu News