Narayana: తిరుమలనాయుడిపై దాడిచేసింది నా మనుషులే అని రూరల్ ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటు: మంత్రి నారాయణ

  • టీఎన్ఎస్ఎఫ్ నేతను ఇంటికెళ్లి పరామర్శించిన టీడీపీ నేత
  • ఎమ్మెల్యే రౌడీయిజం చేయడం దారుణం
  • సూత్రధారులను కఠినంగా శిక్షించాలి

ఏపీ మంత్రి నారాయణ రాష్ట్రంలో స్థితిగతులపై అభిప్రాయాలు వెల్లడించారు. పోలింగ్ ముగిసినా గానీ ఇంకా ఉద్రిక్తతలు నెలకొని ఉండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఇటీవలే దాడికి గురైన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడిని ఉస్మాన్ సాహెబ్ పేటలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలంటూ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రౌడీయిజం చేయడం దారుణమని పేర్కొన్నారు. జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు కాకర్ల తిరుమలనాయుడిపై దాడి చేసింది తన మనుషులే అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి) చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. దాడి వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని, పారిశ్రామిక ప్రగతి నిలిచిపోతుందని అన్నారు.

More Telugu News