KA Paul: వాట్ ఆర్ యూ టాకింగ్?.. చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా! జగన్ ఓ క్రిమినల్!: టీవీ యాంకర్ పై కేఏ పాల్ ఫైర్

  • టీవీ చానల్ స్టూడియోలో నియంత్రణ కోల్పోయిన కేఏ పాల్
  • యాంకర్ పై నిప్పులు చెరిగిన వైనం
  • యాంకర్ నే ఎదురు ప్రశ్నలు అడిగిన పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఆవేశం ప్రదర్శించారు. ఈ సందర్భంగా యాంకర్ పై పలుమార్లు ఆగ్రహం ప్రదర్శించిన పాల్ అసలు ఈ ఇంటర్వ్యూకి నేనెందుకు వచ్చాను? దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని వచ్చాను అంటూ మొదలుపెట్టి అనేక అంశాలపై మాట్లాడారు. మళ్లీ మోదీ నాయకత్వం రాకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పిన కేఏ పాల్ ఓ దశలో నియంత్రణ కోల్పోయినట్టు కనిపించారు.

'నేను ఒక్క నిమిషంలో కోటి రూపాయలు సంపాదించగలను, నా సమయం వృథా చేయొద్దని' యాంకర్ పై మండిపడ్డారు. మీరు వ్యక్తిగత ప్రశ్నలు అడగొచ్చు కానీ మేం ఎలాంటి వ్యక్తిగత ప్రశ్నలు అడక్కూడదా? అంటూ చిందులేశారు. మీకు మరోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలా? వద్దా? అంటూ ఆవేశం ప్రదర్శించారు.

"నేను చంద్రబాబు లాగా, జగన్ లాగా, కాంగ్రెస్ నేతల్లాగా లక్షల కోట్లు దోచుకోలేదు. నా సొంత సంపాదననే 37 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో డొనేట్ చేస్తున్నాను" అంటూ చెబుతుండగా, టీవీ యాంకర్ అందుకుని, ఇన్ని చేస్తున్న మిమ్మల్ని ఈ రాష్ట్ర నాయకులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదు? అంటూ కవ్వించే ప్రయత్నం చేశారు. దానికి తోక తొక్కిన తాచులా లేచిన కేఏ పాల్, 'నా ముందు బచ్చాలు వీళ్లందరూ' అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.

"చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా. జగన్ ఓ క్రిమినల్. పవన్ కల్యాణ్ ను అయితే లెక్కలోకే తీసుకోను. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనంతా నేషనల్ లీడర్స్ తోనే రాజకీయాలు చేస్తాను,  కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ పెద్దనాయకులా? మీరు చెబుతున్న చంద్రబాబు, జగన్ పెద్ద నాయకులా?" అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

More Telugu News