Andhra Pradesh: చంద్రబాబు రికార్డులను ట్యాంపర్ చేసేస్తాడు.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించండి!: వైసీపీ నేత రామచంద్రయ్య

  • వైసీపీ కార్యకర్తలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయి
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయి
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత సి.రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు రికార్డులను ట్యాంపర్ చేసే అవకాశముందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సి.రామచంద్రయ్య మాట్లాడారు.

ప్రస్తుతం ఏపీలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు అదుపులోకి రావాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి.

దీనిపై వైసీపీ గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేసింది. మరోవైపు టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలపై దాడిచేసిన పలువురు నిందితులను పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి పాలన విధించాలని రామచంద్రయ్య కోరారు.

More Telugu News