Tamilnadu: మాజీ ఎంపీ భార్య దారుణహత్య... కొడుకే హంతకుడని అనుమానం!

  • అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు భార్య రత్తినం
  • రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించిన వైనం 
  • కుమారుడు ప్రవీణ్ కోసం పోలీసుల గాలింపు

అన్నాడీఎంకే మాజీ పార్లమెంట్ సభ్యుడు కుళందైవేలు భార్య రత్తినం (63) దారుణ హత్యకు గురికాగా, ఆమెను చంపింది కుమారుడేనన్న అనుమానంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కుళందైవేలు, రత్తినం దంపతులకు ప్రవీణ్ అనే కుమారుడు, సుధ అనే కుమార్తె ఉండగా, ప్రవీణ్ లండన్ లో చదువుకుంటున్నాడు. కొంతకాలం క్రితం కుళందైవేలు మరణించడంతో బీసెంట్ నగర్ లోని ఓ ఇంట్లో రత్తినం ఒంటరిగా ఉంటున్నారు. నెల రోజుల క్రితం లండన్ నుంచి వచ్చిన ప్రవీణ్ అప్పటి నుంచి ఆస్తులను పంచాలని గొడవ పడుతున్నాడు.

ఆదివారం నాడు గొడవ తీవ్రం కాగా, ఇదే విషయాన్ని రత్తినం తిరుప్పూరులో ఉండే తన కుమార్తె సుధకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో సుధ చెన్నైలోని తమ బంధువులకు విషయం చెప్పి, ఓ మారు వెళ్లి విచారించాలని కోరింది. ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా, బయటివైపు తాళాలు వేసివుండటంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించగా, నోటికి ప్లాస్టిక్ టేపు అంటించి, కాళ్లను కట్టేసిన స్థితిలో రక్తపు మడుగులో రత్తినం మృతదేహం కనిపించింది. ప్రవీణ్ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉంది. దీంతో ఆస్తి కోసం ప్రవీణ్ తన తల్లిని చంపేసి వుండవచ్చన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News