Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం.. కాన్వాయ్ పై రాళ్ల వర్షం!

  • బిజ్‌బెహరా పట్టణానికి వెళుతుండగా ఘటన
  • మెహబూబా సురక్షిత ప్రాంతానికి తరలింపు
  • అనంతనాగ్ నుంచి పోటీ చేస్తున్న మెహబూబా 

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి సొంత నియోజకవర్గంలో తీవ్ర నిరసన ఎదురయింది. అనంతనాగ్ లోక్ సభ నియోజకవర్గంలో ఈరోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం మెహబూబా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఖిరాం గ్రామంలో దర్గాను సందర్శించి బిజ్‌బెహరా పట్టణానికి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు ఆమె కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించాయి.

ఈ ఘటనలో మెహబూబా డ్రైవర్ కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్న భద్రతాబలగాలు, దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెహబూబా అనంతనాగ్ జిల్లా నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఇదే సీటు నుంచి మెహబాబూ మరోసారి పోటీ చేస్తున్నారు.

More Telugu News