Andhra Pradesh: కోటంరెడ్డి ఆఫీసు ముందు టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన.. వెంటపడి తరిమికొట్టిన వైసీపీ కార్యకర్తలు!

  • నెల్లూరులో నిన్న కాకర్ల తిరుమలనాయుడిపై దాడి
  • చంటిబిడ్డతో కలిసి ఆందోళనకు దిగిన ఆయన భార్య
  • భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు

టీడీపీ విద్యార్థి విభాగం తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) నెల్లూరు అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడిపై నిన్న దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమల నాయుడు భార్య ఈరోజు నెల్లూరులోని కోటంరెడ్డి ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. చంటిబిడ్డతో రోడ్డుపై బైఠాయించి తన భర్తపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆమెకు మద్దతుగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు కూడా పెద్దఎత్తున అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వైసీపీ కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలను వెంటపడి మరీ తరిమికొట్టారు. దీంతో ఇక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ గొడవల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

More Telugu News