Guntur District: వైసీపీ కార్యాకర్తలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: బొత్స సత్యనారాయణ

  • గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాం
  • దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం
  • గురజాల, సత్తెనపల్లి, వేమూరు, నరసరావుపేటలో దాడులు జరిగాయి

ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ కార్యాకర్తలపై దాడులు చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం, మీడియాతో బొత్స మాట్లాడుతూ, గురజాల, సత్తెనపల్లి, వేమూరు, నరసరావుపేటలోని వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు చేపట్టాలని రూరల్ ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఇనిమెట్లలో పోలింగ్ బూత్ ను క్యాప్చర్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. కోడెల చేసిన తప్పును వదిలేసి తమ నేతలపై కేసులు పెట్టారని విమర్శించారు. వేమూరులో మేరుగ నాగార్జునపై హత్యాయత్నం జరిగిందని, ఆయన కారు అద్దాలు పగలగొట్టారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు.

More Telugu News