Andhra Pradesh: చంద్రబాబు పని అయిపోయిందని ఆరోజే చెప్పాం.. ఏపీలో వైసీపీకి 150 సీట్లు గ్యారెంటీ!: బొత్స

  • తన వైఫల్యాలను బాబు వ్యవస్థలపై తోసేస్తారు
  • ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ల దగ్గరకు వెళ్లి బాబు పడుకోవాలి
  • విజయవాడలో మీడియాతో వైసీపీ నేత

తన అసమర్థత, వైఫల్యాలను చంద్రబాబు వ్యవస్థలపై తోసివేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలతోనే గెలిచాడని గుర్తుచేశారు. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు తమకున్న అవలక్షణాలను ఎదుటివారికి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ స్పీకర్ కోడెలపై దాడి ఘటనలో వైసీపీ నేత అంబటి సహా ముగ్గురు పార్టీ నేతలపై పోలీసులు కేసు పెట్టడంపై బొత్స మండిపడ్డారు.

స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర వైసీపీ ఫలితాలను తారుమారు చేస్తుందన్న చంద్రబాబు ఆరోపణల నేపథ్యంలో బొత్స స్పందిస్తూ.. ‘అమ్మో నన్ను అరెస్ట్ చేస్తారు. చుట్టూ వలయంలాగా ఉండి నన్ను కాపాడండి అని చంద్రబాబు ప్రజలను కోరారుగా. అలాగే ఇప్పుడు టీడీపీ నేతలు ఈవీఎం కేంద్రాల చుట్టూ వెళ్లి వలయంలాగా ఉండమనండి. ఓడిపోయే ముందే ఇలాంటి మాటలు వస్తాయి. అంతగా కావాలంటే చంద్రబాబు వెళ్లి స్ట్రాంగ్ రూమ్ దగ్గర పడుకోవాలి.

మొన్న చంద్రబాబు అంటున్నాడు.. ఏపీలో జరిగినవి ఎన్నికలే కావంట. మరి ఏవి ఎన్నికలు? మొన్న నంద్యాలలో జరిగినవేనా అసలైన ఎన్నికలు? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నువ్వు దేశ ప్రజలకు, ఏపీ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు?’ అని బొత్స నిలదీశారు. చంద్రబాబు పని అయిపోయిందని ఆరోజే చెప్పామని స్పష్టం చేశారు. ఏపీలో 150 స్థానాల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని బొత్స జోస్యం చెప్పారు.

More Telugu News