Tamil Nadu: ఇంటి కోసం తల్లీకూతుర్ల మధ్య వివాదం... సినీ నటి సంగీతపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

  • ఇంటి నుంచి పొమ్మంటోందంటూ తల్లి భానుమతి ఆరోపణ
  • వార్థక్యంలో తానెక్కడికి వెళ్లగలనని ఆవేదన
  • వివరణ కోరిన మహిళా కమిషన్‌ ప్రతినిధులు

మామగారి నుంచి వారసత్వంగా తనకు సంక్రమించిన ఇంటి నుంచి కన్నకూతురే తనను గెంటేయాలని చూస్తోందని, ముదిమి మీదపడిన ఈ వయసులో తాను ఎక్కడికి వెళ్లగలనని సినీనటి సంగీత తల్లి భానుమతి ఆరోపించారు. కూతురి చర్యను వ్యతిరేకిస్తూ ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు బెదిరిస్తోందంటూ తన ఫిర్యాదులో ఆరోపించారు.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాజధాని చెన్నైలోని వలసరవాక్కంలో భానుమతికి రెండు అంతస్తుల ఇల్లు ఉంది. కిందిభాగంలో  భానుమతి నివసిస్తుండగా, పైభాగంలో సంగీత, క్రిష్‌ దంపతులు ఉంటున్నారు. మామగారి నుంచి భానుమతికి సంక్రమించిన ఈ ఇల్లు ప్రస్తుతం సంగీత పేరున ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని సంగీత చూస్తోందన్నది భానుమతి ఆరోపణ.

కొద్దిరోజుల క్రితం సంగీత తమ్ముడు మృతి చెందాడు. ఉన్న అన్న తల్లిని అడ్డుపెట్టుకుని ఇల్లు ఎక్కడ కాజేస్తాడో అన్న భయంతో సంగీత ఇలా చేస్తోందని భానుమతి ఆరోపిస్తోంది. ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్‌ సంగీతకు నోటీసులు జారీ చేసింది. దీంతో మూడు రోజుల క్రితం సంగీత భర్తతో కలిసి కమిషన్‌ ప్రతినిధుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

More Telugu News