jc diwakar reddy: కమ్మవారు ఒక వైపు.. రెడ్లు మరోవైపు అనే కోణం మంచిది కాదు: జేసీ

  • జగన్ ను గెలిపించుకోవాలనే కసి రెడ్లలో కనిపించింది
  • జగన్ సీఎం అవుతాడనే నమ్మకంతోనే వైసీపీవాళ్లు దాడులకు పాల్పడ్డారు
  • లోకేష్ ను సీఎం చేసే విషయం గురించి చంద్రబాబు ఆలోచించాలి

వైసీపీ అధినేత జగన్ ను గెలిపించుకోవాలనే కసి, పట్టుదల రెడ్లలో కనిపించిందని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని... జగన్ సీఎం అయితే కేసులన్నీ ఎత్తివేస్తాడనే నమ్మకం వైసీపీ శ్రేణుల్లో కనిపించిందని చెప్పారు. అందుకే వారు దాడులకు తెగించారని అన్నారు. ఈరోజు ఉదయానికిగానీ అసలు పరిస్థితి వైసీపీ వాళ్లకు అర్థం కాలేదని చెప్పారు. కమ్మవారు ఒకవైపు, రెడ్లు మరోవైపు అనే కోణం రాజకీయాలకు మేలు చేయదని తెలిపారు. రానున్న ఐదేళ్లలో లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంపై చంద్రబాబు ఆలోచించాలని సూచించారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కువైపోయాయని జేసీ అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక హద్దు ఉండాలని అన్నారు. ఈ విషయంలో రాజ్యాంగబద్ధమైన ఒక నిబంధన ఉండాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా... రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని తెలిపారు.

More Telugu News