Andhra Pradesh: ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత... పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న అఖిలప్రియ

షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూమా, గంగుల వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ తరఫున మంత్రి అఖిలప్రియ పోటీచేయగా, వైసీపీ నుంచి గంగుల నాని బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచే ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఉద్రిక్తతలు సాయంత్రం కూడా కొనసాగాయి.  

సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసిపోవడంతో అధికారులు గేట్లు వేశారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో కొందరు వ్యక్తులు గోడదూకి ఓటేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు స్పందించడంతో వివాదం రాజుకుంది. ఇరువర్గాలు సవాళ్లు విసురుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. అంతలోనే సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ పోలింగ్ బూత్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోతోందన్న అనుమానంతో అధికారులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

గంగుల నాని, అఖిలప్రియ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఓ దశలో పోలింగ్ నిలిపివేసిన అధికారులు పోలీసుల సాయంతో మళ్లీ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh

More Telugu News