Hyderabad: పంతంగి టోల్ ప్లాజాను ధ్వంసం చేసిన ప్రయాణికులు!

  • నిన్న రాత్రి నుంచి బయలుదేరిన ఓటర్లు
  • ప్లాజా వద్ద 5 కి.మీ మేర నిలిచిన వాహనాలు
  • గేట్లను ధ్వంసం చేసి వెళుతున్న ప్రయాణికులు

నిన్న రాత్రి నుంచి ఏపీలోనూ, తెలంగాణలోనూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయలుదేరిన హైదరాబాద్ వాసులతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరడంతో, ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే  పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం వాహనాలు దాదాపు 5 కిలోమీటర్ల మేరకు బారులు తీరాయి.

 రద్దీ ఎక్కువగా ఉన్న వేళ, టోల్ వసూలు వద్దంటూ టోల్ ప్లాజా నిర్వాహకులతో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు, గేట్లను ధ్వంసం చేశారు. అప్పటికే గంటల సమయం వేచివున్న ప్రయాణికులు ఒక్కసారిగా గేట్లను ధ్వంసం చేయడంతో, అక్కడున్న సిబ్బంది ఎవరూ వారిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్లాజాలోని అన్ని గేట్లూ ధ్వంసం కాగా, ప్రస్తుతం వాహనాల క్లియరెన్స్ జరుగుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ప్లాజా దగ్గరకు వచ్చి, అన్ని వాహనాలనూ పంపించిన తరువాత గేట్లను పునరుద్ధరిస్తామని చెప్పడం గమనార్హం.

More Telugu News