Andhra Pradesh: సైకిల్ గుర్తుకే ఓటేయండి.. ఎన్నికల ప్రచారంలో నోరు జారిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య!

  • ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సండ్ర
  • నామా ఎన్నికల ప్రచార సభలో గందరగోళం
  • సండ్ర వ్యాఖ్యలతో గతుక్కుమన్న టీఆర్ఎస్ శ్రేణులు
  • వెంటనే తప్పును సరిదిద్దుకుని టీఆర్ఎస్ కు ఓటేయాలని విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో రాజకీయ వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అయితే మారారు కానీ పాత అలవాట్లను మాత్రం చాలామంది నేతలు వదులుకోలేకపోతున్నారు. అధికార పార్టీలో ఉంటూ విపక్ష పార్టీలకు జై కొడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని కల్లూరులో నిన్న టీఆర్ఎస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ధాటిగా మాట్లాడిన సండ్ర.. చివరగా ‘సైకిల్ గుర్తుకే ఓటేయండి’ అని పిలుపునిచ్చారు.

దీంతో అదే వేదికపై ఉన్న నామా, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు గతుక్కుమన్నారు. వెంటనే తప్పును సరిదిద్దుకున్న సండ్ర.. కారుకే ఓటేయాలని కోరారు. ఇంతకుముందు  నామా నాగేశ్వరరావు కూడా ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. సైకిల్ గుర్తుకే ఓటేయ్యండి అని పిలుపునిచ్చారు. వెంటనే నాలుక కరుచుకుని టీఆర్ఎస్ కే ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు ఆ పార్టీ ఖమ్మం లోక్ సభ సీటును కేటాయించింది.

More Telugu News