Andhra Pradesh: బాలకృష్ణ కొందరు అభిమానులతో దురుసుగా ప్రవర్తించడానికి కారణమదే!: భార్య వసుంధర

  • ఇటీవల అభిమానులపై చేయిచేసుకున్న బాలయ్య
  • ఈ వ్యవహారంపై వసుంధరను ప్రశ్నించిన మీడియా
  • బాలయ్య అభిమానులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్న వసుంధర

టీడీపీ నేత, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం నియోజక వర్గం నుంచి తిరిగి పోటీ చేస్త్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై బాలకృష్ణ భార్య వసుంధర స్పందించారు. బాలయ్య సాధారణంగా తన అభిమానులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని వసుంధర తెలిపారు. అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ తప్పుగా ప్రవర్తించినా, తప్పులు చేసినా ఆయనకు కోపం వస్తుందన్నారు.

‘అభిమానులతో ఉన్న చనువు వల్లే, మనవాళ్లు అన్న అభిమానంతోనే ఆయన(బాలయ్య) అలా ఉంటారండీ. అభిమానులు కూడా ఏమీ అనుకోరు. వాళ్లు చాలా సంతోషంతోనే ఉంటారు. బాలకృష్ణ అంటే గిట్టనివాళ్లు మాత్రమే దీన్ని వేరే రకంగా హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

పేద ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ తట్టుకోలేరు. బసవతారకం ఆసుపత్రికి ఎవరు వచ్చినా చికిత్సను నిరాకరించలేదు. డబ్బులున్నా, లేకపోయినా, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు వచ్చినా, రాకపోయినా అందరికీ చికిత్స అందేలా బాలకృష్ణ చొరవ తీసుకుంటారు’ అని వసుంధర అన్నారు.

More Telugu News