Andhra Pradesh: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాలేజీపై ఎన్నికల అధికారుల దాడులు!

  • అనంతపురం జిల్లా యాడికిలో సోదాలు
  • టీడీపీ జెండాలు, కరపత్రాలు లభ్యం
  • రెండు గదుల్లో తనిఖీలు చేయకుండానే వెనుదిరిగిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఎన్నికల అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని యాడికి ప్రాంతంలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జూనియర్ కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. టీడీపీ నేతలు నగదును ఓటర్లకు పంచేందుకు ఇక్కడ దాచిపెట్టారని సమాచారం రావడంతో తహసీల్దార్‌ అంజనాదేవి, రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖరన్, రెవిన్యూ సిబ్బంది సోదాలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన అధికారులకు ఓ గదిలో టీడీపీ కండువాలు, కరపత్రాలు లభించాయి. అయితే ప్రిన్సిపాల్ రూము, మరో గదికి సంబంధించిన తాళాలు లేకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టకుండానే వెనుదిరిగారు. కాగా, ఈ సోదాల్లో ఇప్పటివరకూ ఎలాంటి నగదు లభించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కాలేజీ ప్రిన్సిపాల్ బెంగళూరు నుంచి వచ్చాక ఈ రెండు గదుల్లో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

More Telugu News