Andhra Pradesh: జగన్ ను అధికారంలోకి రానివ్వండి.. నేనేంటో చూపిస్తా!: లక్ష్మీపార్వతి వార్నింగ్

  • తమ కోవర్టుతో టీడీపీ నేతలు నిందలు వేయించారు
  • చంద్రబాబు, బాలకృష్ణతో అతని ఫోటోలు దొరికాయి
  • మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి

ఓ కోవర్టుతో టీడీపీ నేతలు తనపై నిందలు వేయించారని ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు.  ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళుతున్నానని చెప్పారు. లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందని ఆమె సహాయకుడు కోటి ఆరోపించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కోటి వెనుక ఎవరు ఉన్నారో తేలిపోతుందన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి చంద్రబాబు, బాలకృష్ణతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడే బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.

కోటి విషయమై లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘దండుపాళ్యం డైరెక్టర్ ఓ అభిమానిగా ఇతడిని వెంటపెట్టుకుని ఓరోజు మా ఇంటికి వచ్చాడు. అమ్మా వీడు(కోటి) జూనియర్ ఆర్టిస్ట్ గా వేషాలు వేస్తుంటాడు’ అని చెప్పాడు. దీంతో నేను మర్యాదగా పలకరించాను. ఈ సందర్భంగా మాదీ వినుకొండే అమ్మా.. ఏదైనా పనుంటే చెప్పండి అని కోటి అడిగాడు. దీంతో తాను‘ ఏం వద్దులే బాబూ.. అసెంబ్లీలో మందులు ఇస్తారు మాకు. మా అమ్మకు తెచ్చిపెట్టు’ అని చెప్పాను. ప్రతీనెలా మా అమ్మకు మందులు తెచ్చి ఇచ్చేవాడు.

ఇలా మా అమ్మకు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఇస్తూ ఇంట్లోవాళ్లకు దగ్గరయ్యాడు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందని ఇప్పుడు అర్థమవుతోంది’ అని తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తర్వాత చాలా మంది ప్రజలు అమితంగా గౌరవిస్తున్నారని, అభిమానం పెరిగిందని చెప్పారు. కుటుంబ గౌరవం కోసమే తాను మౌనంగా ఉన్నాననీ, తాను గుట్టు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల చరిత్ర రోడ్డున పడుతుందని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి రాగానే తానేంటో చూపిస్తానని హెచ్చరించాడు.

More Telugu News