Andhra Pradesh: వైసీపీకి షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే విజయకుమార్!

  • చంద్రబాబు దగ్గరకు తీసుకొచ్చిన మంత్రి గంటా
  • గతంలో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా పనిచేసిన విజయకుమార్
  • సంక్షేమ పథకాలను చూసే టీడీపీలో చేరారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల గడువు సమీపించిన నేపథ్యంలో విపక్ష వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నేత, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే టి.విజయకుమార్ ఈరోజు టీడీపీలో చేరారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయకుమార్ ను ఈరోజు అమరావతికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తాను టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నానని విజయకుమార్ తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రస్తుతం విజయకుమార్ విశాఖపట్నం ఎంపీ స్థానం వైసీపీ ఇన్ చార్జీగా ఉన్నారు. తాజాగా టీడీపీలో చేరిన అనంతరం విజయకుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే టీడీపీలో చేరానని తెలిపారు. ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. టీడీపీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.

More Telugu News